Friday 3 January 2014

మా'స్టారు'

దొక గవర్నమెంటు మున్సిపల్ స్కూల్. పేరుకు రాజమండ్రిలోనే ఉంది కానీ ఉంది కానీ లోపలికి వెళితే ఒక రకమైన పళ్ళెటూరి వాతావరణం కనిపిస్తుంది. నిజానికి ఆ స్కూలే కాదు దాదాపు అన్ని మునిసిపల్ స్కూళ్ళలోనూ అదే విధమైన పరిస్థితి ఉంటుంది . ప్రైవేటు స్కూళ్ళకీ ఈ స్కూళ్ళకి చాలా తేడా ఉంటుంది. వాళ్ళకి లేని స్వేచ్చ ఈ స్కూళ్ళో చదివే వారికి బాగా ఉంటుంది. అలా అని ఈ స్కూళ్ళో చదివే వారుండరనీ కాదు, క్రమశిక్షణ ఉండదనీ అసలే కాదు. గొప్ప గొప్ప వాళ్ళంతా యిలాంటి స్కూళ్ళో చదివిన వారే. కొన్నేళ్ళ క్రితం ప్రైవేట్ స్కూళ్ళు ప్రభంజనం లేనపుడు ఈ మునిసిపల్ స్కూళ్ళే రాజ్యమేలాయి. పేదా గొప్ప అనే భేదం లేదుండా అందరి పిల్లలు ఇక్కడే చదివేవారు. క్రమేణా ప్రైవేటు స్కూళ్ళ హడావిడి పెరిగాక వీటి ప్రాబల్యం తగ్గిపోయి డబ్బున్నోళ్ళంతా తమ పిల్లల్ని వాటిలో చేర్చేసారు. ఫలితం- మున్సిపల్ స్కూళ్ళు కేవలం పేదవారి బడిగా మిగిలిపోయింది. అరకొర వసతులతో అలాగే నెట్టుకోస్తున్నారు అక్కడి మాస్టార్లు.
అది పదో గరగతి A సెక్షన్. పిల్లలంతా  ఓ వ్యక్తి కోసం ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ వ్యక్తి కొత్తగా రాబోయే లెక్కల మాస్టారు. పేరు 'శంకర నారాయణ'. యింతకు ముందు లెక్కల మాస్టారిగా పని చేసిన భాస్కర రావు మాస్టారికి వేరే ఊరికి ట్రాన్స్ ఫర్ అవటంతో కొత్త మాస్టారు వచ్చారు. తెల్లగా ఎత్తుగా ఆకట్టుకొనే రూపంతో ఉన్నారు 'శంకర నారాయణ' మాస్టారు.

అతను రాగానే పిల్లలందరూ లేచి గుడ్ ఆఫ్టర్ నూన్ సార్ అని కోరస్ గా అరిచారు పిల్లలు.  
శంకర నారాయణ నవ్వుతూ 'గుడ్ మార్నింగ్' అన్నాడు.
పిల్లల్లో కొంత మంది ఆశ్చర్యంగా మొహం పెట్టి చూసారు 'మిట్ట మధ్యాహ్నం గుడ్ మార్నింగ్ అంటాడేమిట్రా అని.
అది పసిగట్టిన శంకర్ వారితో "ఏమిటీ మధ్యాహ్నం పూట 'గుడ్ ఆఫ్టర్ నూన్ అనక  'గుడ్ మార్నింగ్' అంటున్నానేమిటీ అని ఆలోచిస్తున్నారా? గుడ్. ఎప్పుడైనా ఒక వ్యక్తిని ఆ రోజులో మొదటి సారి కల్లిసినపుడు 'గుడ్ మార్నింగ్' అనాలి అలాగే విడిపోయేటపుడు గుడ్ నైట్ అని అనాలి, అది ఏ టైములో కలిసినా సరే."
పిల్లలు ఆశక్తిగా చూసారు. వారిలో ఒక అబ్బాయి "అంటే రాత్రి పూట మొదటి సారి కలిసినా గుడ్ మార్నింగ్ అనే అనాలాండీ?
"అవును"
"మరి విడిపోయేటపుడు పొద్దున్నైనా 'గుడ్ నైట్' అనాలాండీ? "
నవ్వుతూ "అవును" అన్నాడు శంకర నారాయణ.
పిల్లలంతా నవ్వారు. వారికి భలే ఆశ్చర్యంగా ఉంది కొత్త విషయం తెలుసుకున్నందుకు.
"సరే. నా పేరు శంకర నారాయణ. లెక్కల టీచరుని. యిక మిమ్మల్ని పరిచయం చేసుకుంటారా? ఒక్కొక్కరే మీ పేరు చెప్పండి" అన్నాడు నవ్వు చెరగనీయకుండా.
*              *                *           
పిల్లలంతా ఒక్కొక్కరే లేచి తమ పేరు చెప్పి పరిచయం చేసుకున్నారు. ఆ కార్యక్రమం పూర్తి అయిపోయాక శంకర నారాయణ వారితో "ఈ రోజు మొదటి రోజు కాబట్టి మనము లెక్కలు చెప్పుకోబోవటం లేదు. సరేనా?"
పిల్లలకి మంచి ఉత్సాహమొచ్చేసింది.
"అలాగే సార్" అని అరిచారు. వాళ్ళకిమంచి ఉత్సాహంగా ఉంది. కొత్త మాస్టారు ఎలాంటి వాడొస్తాడో అని టెన్షను పడిన వాళ్ళకి అతని తీరుతో ఒక్క సారిగా మంచి రిలీఫొచ్చింది.
"లెక్కలు చెప్పుకోవద్దు సరే. మరేం చెప్పుకుందాం? ఓ గంట సేపు గడవాలిగా?"
"సినిమా కధ చెప్పుకుందాము సార్. బాగుంటుంది" అన్నాడో అబ్బాయి వెనకనుండి.
పిల్లలు గట్టిగా నవ్వారు.
శంకర నారాయణ కి కూడా నవ్వొచ్చింది.
"సినిమా ఆల్రెడీ హాల్లో చూస్తాము కదా? మళ్ళీ యిక్కడెందుకు? సరే ఓ పని చేద్దాం. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలేస్తాను. మీరు సమాధానం చెప్పండి. సరేనా?"
"దేనికి సంబంధించినవండీ? జనరల్ నాలెడ్జుకి సంబంధించినవా?" అన్నాడు మొదటి బెంచిలో కూర్చున్న రమేష్ ఉత్సాహంగా. మొన్నే ఓ జనరల్ నాలెడ్జీకి సంబంధించిన ఓ టెస్టు బట్టీ పట్టేసి అది నిర్వహించిన వాళ్ళ దగ్గర ఓ సర్టిగికేటు తీసున్నాడు మరి.
"కాదు. మీ గురించే అడుగుతాను. సరేనా?"
ఏమడుగుతాడో అర్ధం కాకపోయినా లెక్కలకు సంబంధించినది కాకపోవటంతో సరేనన్నారంతా.
మీ క్లాసులో బాగా చదివే అంటే బాగా మార్కులొచ్చేదెవరికి?
అందరూ రమేష్ వంక చూపించారు. రమేష్ ఒకింత సిగ్గుతో కూడిన గర్వంతో చూసాడు మాస్టారి వైపు.
శంకరనారాయన నవ్వుతూ "గుడ్. మరి అస్సలు చదవని - అంటే అన్నింటిలోను మార్కులు తక్కువొచ్చేది ఎవరికి?"
అందరూ చివరి బెంచీ లో కూర్చున్న ఓ అబ్బాయి వంక చూసారు. అతని పేరు "త్రిమూర్తులు ".
అందరూ తననే చూస్తుండటంతో సిగ్గుగా యిబ్బందిగా అనిపించింది త్రిమూర్తులుకి. అది గమనించిన శంకరనారాయణ వాళ్ళతో "నా ఉద్దేశ్యం ఎవరినీ అవమానించడానికో  ఎవరినీ పొగడటానికో కాదు. నా దృష్టిలో మీరంతా నాకు సమానమే. కానీ నేను చెప్పాలనుకుంటున్నదేమిటంటే బాగా చదివే రమేష్ ముందు బెంచీలో కూర్చుని, బాగా చదవని త్రిమూర్తులు చివరి బెంచీలో కూర్చుంటే యింక అతనికి చదువెలా వస్తుంది? యిద్దరూ తెలివైన వారే. రమేష్ లాంటి విద్యార్ధులు ఏ బెంచీలో ఉన్నా చదువుతారు. కానీ బాగా చదవని విద్యార్ధులు ముందు బెంచీలో ఉంటే బాగుంటుంది. ఏమంటారు?"
తరగతిలోని చాలామంది పిల్లలలకి అతని సూచన నచ్చింది. కానీ ముందు వరసలో ఉన్న కొంతమంది పిల్లలకి ఈ సూచన అస్సలు నచ్చలేదు. యింతకాలం ముందు బెంచీలో కూర్చున్న తామంతా వెనక బెంచీలోకి వెళ్ళిపోతామేమోనని వారికి భయమేసింది.  నిశబ్దంగా ఉంటే మాస్టారు అన్నత పనీ చేసేస్తారేమోననిపించింది వారికి. వారిలో ఒకడు శంకరనారాయణతో "సార్. వెనక బెంచీలో వారిని ముందు బెంచీలో కూర్చోపెడితే తెలివైనవారైపోరు కదండీ? అలాంటప్పుడు వాళ్ళని మార్చడమెందుకండీ?" అన్నాడు.
శంకరనారాయణ నవ్వి " వాళ్ళ సంగతి సరే. బాగా చదివే వాళ్ళని వెంక బెంచీలో కూర్చుంటే వాళ్ళ తెలివి ఏమైనా  తక్కువైపోతుందా?"
పిల్లలంతా ఆయన మాటకి ఘొల్లున నవ్వారు. శంకరనారాయణ కొనసాగిస్తూ "నిజమే. అతను చెప్పిన దాంట్లో కొంత నిజముంది. వెనక బెంచీలో కూర్చున్న వారు ముందు బెంచీలో కూర్చుంటే తెలివైన వారిగా మారిపోరు. కానీ మీరు ఒక విషయం గమనించండి. సాధారణంగా వెంక బెంచీల్లో కూర్చునే పిల్లలు పాఠాలు సరిగ్గా వినరు. వినకపోయినా మాస్టారు పట్టించుకోరనే ధైర్యం. అదీ కాక వారికి ముందు బెంచీలో కూర్చునే పిల్లల కంటే స్వేచ్చ ఎక్కువగా ఉంటుంది. అల్లరి కూడా ఎక్కువే అనుకోండి. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నా. మార్కులు తక్కువొచ్చే పిల్లలందరూ ముందు బెంచీల్లోనూ, బాగా చదివే పిల్లంతా వెంక బెంచీలోనూ కూర్చోవాలి. దీనివలన చదవని పిల్లలు చదివేస్తారని కాదు కానీ వారు కనీసం కొంత  మార్పు వస్తుందని నా అభిప్రాయము."
అయినా మాస్టారి నిర్ణయము మింగుడు పడని రమేష్ "సార్ మీరు ఎంత ప్రయత్నం చేసినా వెనక బెంచీ వాళ్ళు ఏ మాత్రం చదవరండీ." అన్నాడు.
రమేష్ మాటతో తరగతిలో వాతావరణం వేడెక్కింది.  పిల్లలు శంకరనారాయణకేసి ఆశక్తిగా ఎదురు చూడసాగారు అతను ఏమి చెపుతాడా అని. 
"అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు?
రమేష్ ఏమాత్రం తగ్గకుండా "ఎందుకంటే వాళ్ళకి మీరు చెప్పేది ఏమీ అర్ధం కాదు సార్."
"అదే ఎందుకని అడుగుతున్నాను.వాళ్ళకి లేనిదీ నీకు ఉన్నది ఏమిటీ అని?
"తెలివితేటలు"
"మార్కులు తక్కువ తెచ్చుకున్నవారందరికి తెలివితేటలు తక్కువ ఉంటాయని నువ్వు ఎలా చెప్పగలవు?"
క్లాసులో పిల్లంతా ఆశక్తిగా ఒక రకమైన భయంతో వింటున్నారు వీరిద్దరి సంభాషణని.
"మార్కులని బట్టే కదండీ మరి తెలివితేటలు బయటకొచ్చేది."
"సరే నీకు మార్కులెందుకు వస్తున్నాయి?"
"బాగా చదవడం వలన"
"కేవలం చదవడం వల్లేనా?"
రమేష్ మాస్టారి ప్రశ్నకి ఒక్క క్షణం ఆగి "చదివింది పరీక్షలో రాయడం వల్లండి"    
"అందులో తెలివితేటల ప్రశ్నేముంది? చదివింది గుర్తు పెట్టుకొని పరీక్షలో వ్రాస్తున్నావు. అంతే గానీ , నీ స్వంతగా ఏమీ వ్రాయడం లేదు కదా?"
పిల్లలు ఒక్కసారిగా నవ్వారు మాటకి. రమేష్ కి అహం దెబ్బ తింది.
"తెలివితేటలు ఉంటేనే కదండీ చదివింది గుర్తుంటుంది."
శంకరనారాయణ ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేదు. నెమ్మదిగా తన సీటు దగ్గరెకెళ్ళి నించున్నాడు.
"సరే చిన్న పరీక్ష పెడతాను. నిన్నూ త్రిమూర్తులునీ కొన్ని ప్రశ్నలు వేస్తాను. దాన్ని బట్టి ఎవరు తెలివైనవారో తెలిసిపోతుంది. సరేనా?"
రమేష్ కూడా ఏమాత్రం తగ్గకుందా "సరే" అన్నాడు.
క్లాసులో పిల్లలంతా చప్పట్లు చరిచారు.
"రమేష్, త్రిమూర్తులూ యిద్దరూ చెరో వైపున నించోండి"
రమేష్ మంచి ఉత్సాహంగా వచ్చి నించున్నాడు. త్రిమూర్తులు మాత్రం ముందుకి రాకుండా తన బెంచీ దగ్గరే నిలబడి ఉన్నాడు బెరుగ్గా.
శంకరనారాయణ అతన్ని పిలిచాడు.
"త్రిమూర్తులూ ! భయపడాల్సిందేమీ లేదు. నిన్ను యిబ్బంది పెట్టే ప్రశ్నలేమీ వెయ్యను సరేనా? రా యిక్కడికి"
త్రిమూర్తులుకి కొంచెం ధైర్యం వచ్చింది మాటతో. నెమ్మైగా ఆయన దగ్గరకెళ్ళి నిలబడ్డాడు. శంకరనారాయణ వాళ్ళిద్దరినీ చెరో వైపున నించోబెట్టాడు.
"అయితే రమేష్. నీ ఉద్దేశ్యంలో కేవలం తెలివి ఉన్నవారికి "మాత్రమే" జ్ఞాపకశక్తి ఉంటుంది గానీ అది లేని వారికి జ్ఞాపకశక్తి ఏమాత్రం ఉండదు. అంతే కదా?" "మాత్రమే" అన్న పదాన్ని వత్తి పలుకుతూ.
రమేష్ "అవునండీ" అన్నాడు.
"సరే యిప్పుడు నేను పెట్టబోయే పరీక్ష మీ యిద్దరి జ్ఞాపకశక్తికి సంబంధింధింది. రమేష్ చెప్పిన దాని ప్రకారం ఎవరికి ఎక్కువ తెలివితేటలుంటే వారికి ఎక్కువ జ్ఞాపకశక్తి ఉన్నట్టు నిరూపించబడుతుంది. జ్ఞాపకశక్తి లేని వారు ఆటోమాటిక్ గా తెలివి లేని వారి క్రింద జమకట్టబడతారు. నీకు అంగీకారమేగా?". 
రమేష్  ఉత్సాహంగా తలూపాడు
"సో …. పిల్లలూ - మీరు కూడా రెడీయే కదా వీరిద్దరికీ పెట్టబోయే పరీక్షని చూడటానికి?"
"ఎస్ సార్" అని అరిచారు పిల్లలంతా.
పరీక్ష మొదలయ్యింది.

  *                           *                              *
                                                        

'ముందుగా మనం రమేష్ తో మొదలెడదాం. ఏం రమేష్, సరేనా?
సరేనన్నట్టుగా తలూపాడు రమేష్.
'సరే ఏ విషయం మీద అడగమంటావు? నువ్వే చెప్పు. చాయిస్ నీదే'
'మీ ఇష్టం సార్.'
సరేనని అతనికి మేత్స్ బుక్ తీసి  ఆల్ జీబ్రా నుంచి ఓ లెక్క తీసుకొని వ్రాసాడు బోర్డ్ మీద. రమేష్ ఒక్కసారి చూసి ఆ లెక్కని రెండు నిమిషాల్లో చేసి చూపించాడు బోర్డ్ మీద. శంకరనారాయణ పిల్లల్ని చప్పట్లు కొట్టమన్నట్టుగా సైగ చేసాడు. దాంతో పిల్లలంతా చప్పట్లు కొట్టారు. విజయగర్వంగా చూసాడు రమేష్.
'వెరీ గుడ్. నువ్వు చెప్పిందే నిజమయ్యేలా ఉందే చూస్తోంటే.'
సరే ఇదే మ్యాత్స్ నుండి ఇంకో ప్రశ్న అడుగుతాను అని యింకో లెక్క ఇచ్చాడు.
రమేష్ ఆ లెక్క వంక చూసి ఆలోచనలో పడ్డాడు. ఏంటీ యిది తన టెక్స్ట్ బుక్ లో లేదే అనుకుంటూ ఉండగా శంకరనారాయణ అన్నాడు 'ఏం రమేష్ ఏమిటి ఆలోచిస్తున్నావు? చేయగలవా, చేయలేవా?'
'సార్ యిది టెక్స్ట్ బుక్ లోది కాదు సార్.'
'తెలుసు. నువ్వు చేయగలవా లేదా అది చెప్పు.'
'నాకు చెప్పని లెక్కల్ని నేనెలా చేయగలనండి?'
'అంటే చేయలేవా?'
'............'
'సరే యిది వదిలేద్దాం. యిది పూర్తి చేయగలవేమో చెప్పు.' అని యింకో లెక్క బోర్డ్ మీద వ్రాసాడు.
దాని వంక మళ్ళీ పరీక్షగా చూసిన రమేష్ 'సార్. యిది కూడా మా సిలబస్ లో లేదండి.' అన్నాడు.
'అవునా? సరే. సిలబస్ లో లేని లెక్కల్ని నువ్వు మాత్రం ఏమి చేయగలవు గానీ. సరే. కాసేపు లెక్కల్ని వదిలేద్దాం. సరదాగా ఓ పద్యమడుగుతాను చెప్పు.'
'అప్పిచ్చువాడు వైద్యుడు..... ఈ పద్యాన్ని పూర్తిగా చెప్పు.'
రమేష్ తీవ్రంగా ఆలోచించాడు. గుర్తు రాలేదు. చాలా ప్రయత్నించాడు.
ఐదు నిమిషాల తర్వాత 'ఏ? రాదా? లేక మర్చిపోయావా?'
'వచ్చు సార్ కానీ గుర్తు లేదు. ఎందుకంటే అది ఎప్పుడో ఆరో క్లాసులో నేర్చుకున్న పద్యం కదండీ.'
'సరే పద్యం పూర్తి చేయొద్దు. కనీసం అది ఎవరు వ్రాసిన పద్యమో చెప్పు చాలు. '
.......................
'నీకు 9 వ తరగతిలో లెక్కల్లో ఎన్ని మార్కులొచ్చాయి?'
'తొంభై అయిదు సార్'
'నేను నిన్ను అడిగిన రెండో లెక్క తొమ్మిదో తరగతి టెక్స్ట్ బుక్కు లోనిదే. మూడో లెక్క ఏడవ తరగతిలోని లెక్క.
మరి ఎందుకు చెప్పలేకపోయావు?'
'అప్పటివి యిప్పుడు ఎలా గుర్తుంటాయండి? '
'మరి నువ్వు తెలివైనవాడివి కదా. నీకు జ్ఞాపకశక్తి బాగా ఉండాలి కదా మరి? '
క్లాసులో పిల్లలు నవ్వారు. కొంత మంది అరిచారు కూడా.
రమేష్ అవమానభారంతో ఊగిపోయాడు. మాస్టారితో వాదనకి దిగాడు.
'సార్ యిప్పటి విషయాలను అడగండి. చెప్పకపోతే చూడండి.'
'సరే. కాసేపు చదువు గురించి వదిలేద్దాం. మొన్న నువ్వు ఏ రంగు చొక్కా వేసుకున్నవో చెప్పు?
మళ్ళీ ఆలోచనలో పడ్డాడు రమేష్. మొన్న ఏ రంగు చొక్కా వేసుకున్నాడు తను? ఎరుపు రంగా? నీలం రంగా? ఏదీ? గుర్తు రావడం లేదు. సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు.
'సరే. ఈ ప్రశ్నకి జవాబు చెప్పు. మీ అమ్మ గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పు?'
అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఏంటీ? తనకి ఎపుడైనా చెప్పిందా? లేదా తనకి గుర్తు రావడం లేదా?
'ఫిబ్రవరి నెల....................... 13........కాదు కాదు....................12........కాదు.....కాదు' తడబడుతూ చెపుతున్నాడు రమేష్.
పిల్లలంతా మరోసారి గట్టిగా నవ్వారు. రమేష్ తల దించేసుకున్నాడు సమాధానం తెలీక.
 'యింక ఏమీ ప్రశ్నలడగను. సో. నువ్వు తెలివైన వాడివని నిరూపించుకోలేకపోయావు. అంతేనా? ఎందుకంటే నీ లెక్క ప్రకారమే చూసుకున్నా నీకు ప్రతీ విషయం గుర్తుండి తీరాలి. కానీ నీకు కేవలం కొన్ని విషయాలు మాత్రమే గుర్తుంటున్నాయి. అది కూడా నీకు పనికొస్తాయనుకున్నవి మాత్రమే. నీకు అక్కర లేదనుకున్న విషయాల్ని నువ్వు వెంటనే మర్చిపోతావు ... లేదా మెదడు లోంచి తొలగించేస్తావు. అంటే నువ్వు చదివేది కేవలం ఆ సంవత్సరం మంచి మార్కులు తెచ్చుకోవడానికి 'మా.....త్ర......మే'. అంటే నువ్వు యిష్టం తో చదవటం లేదు. మంచి మార్కులు తెచ్చుకోవాలనే స్వార్ధం తో చదువుతున్నావు. యిది నీ తప్పు కాదు. చదువంటే కేవలం మంచి మార్కులు తెచ్చుకోవడమే అనే దృక్పధం మారనంతవరకూ అంతే. దీనికి నిన్ను ఒక్కడినే తప్పు పట్టాల్సిన పని లేదు. కానీ యిది ఎందుకు చెపుతున్నానంటే తెలివితేటలకీ జ్ఞాపకశక్తికీ సంబంధం లేదు. యిక్కడ ఉండాల్సింది కేవలం ఆశక్తి, నేర్చుకోవాలనే తపన మాత్రమే. అర్ధమయ్యిందా?'
'అర్ధమయ్యింది సార్ ' అన్నాడు రమేష్ దించుకున్న తల ఎత్తకుండానే.
'సరే వెళ్ళి కూర్చో'
'సరే. ఒక విషయం లో మాత్రం రమేష్ ని మెచ్చుకోవాలి. మొన్న ఏ రంగు చొక్కా వేసుకున్నావంటే గుర్తు రాలేదని నిజాయితీగా చెప్పాడు గానీ ఏదో ఒక రంగు చెప్పేయలేదు. వెరీ గుడ్. అందుకు రమేష్ ని అభినందిస్తున్నా. సో ... రమేష్ ని అడగాల్సినవి అడిగేసాం కదా. యిప్పుడు త్రిమూర్తులు వంతు. త్రిమూర్తులూ ...ఇలా రా ' అని పిలిచాడు శంకరనారాయణ.
బిక్కు బిక్కుమని వచ్చాడు త్రిమూర్తులు తనని ఏమడుగుతారో అనుకుంటూ. అది గమనించిన శంకరనారాయణ నవ్వుతూ "ఏమీ భయపడకు నిన్ను ఎటువంటి ప్రశ్నలు వేయబోవడం లేదు. నిశ్చింతగా ఉండు" అన్నాడు.
త్రిమూర్తులుతో సహా క్లాసు పిల్లలు అందరూ ఆశ్చర్యంగా చూసారు ఆయన వంక.
అదేమీ పట్టించుకోకుండా త్రిమూర్తులుని అడిగాడు.
'చెప్పు త్రిమూర్తులూ.మీ యిల్లెక్కడ?
చెప్పాడు త్రిమూర్తులు.
'ఓ. మీ యిల్లు అక్కడా? అక్కడనించి ఎలా వస్తావు? సైకిల్ మీదా? లేదా నడిచా?'
సైలిల్ మీద సార్.
నెమ్మదిగా అతన్ని మాటల్లో దించాడు శంకరనారాయణ. కాసేపటికి బెరుకు పూర్తిగా మాయమై మాస్టారితో ఫ్రీ గా మాట్లాడసాగాడు. శంకరనారాయణ కోరుకున్నది కూడా అదే.
'సినిమాలు చూస్తావా?'
క్లాసులో ఒకడు అన్నాడు గట్టిగా 'అబ్బే ఎక్కువ చూడడండి రోజుకోకటే'
అందరూ నవ్వారు. శంకరనారాయణ కూడా నవ్వి 'అవునా? అయితే నీ ఫేవరెట్ హీరో ఎవరు?'
'మహేష్ బాబు సార్ ' ఠక్కున చెప్పాడు.
'అవునా? మహేష్ బాబు అంటే నాకు కూడా ఇష్టమే. అన్నట్టు అతని మొదటి చిత్రమేంటో తెలుసా?'
'హీరోగానా లేక బాలనటుడిగానా అండి?' ఠక్కున అడిగాడు త్రిమూర్తులు.
ఒక్క క్షణం త్రిమూర్తులుని చూసాడు శంకరనారాయణ. తనకు కావలసినది దొరుకుతోంది.
'సరే హీరోగా మొదటి సినిమా చెప్పు'
'రాజకుమారుడు'
'మరి బాలనటుడిగా? నాకు తెలిసి..........  'పోరాటం' కదా?'
'కాదండి. అందరూ అదే అనుకుంటారు కానీ దానికన్న అతను వాళ్ళన్నయ్య నటించిన 'నీడ' అనే ఓ సినిమాలో నటించాడు. బాలనటుడిగా అదే అతని మొదటి సినిమా.'
క్లాసంతా నిశభ్దంగా అయిపోయింది. మాస్టారినీ, త్రిమూర్తులునీ చూస్తున్నారంతా.
'అవునా? ఆ సినిమాకి డైరెక్టరెవరో తెలుసా మరి?'
'దాసరి నారాయణరావండి. ఆ సినిమా 1979 లో వచ్చింది. అప్పటికి మహేష్ బాబుకి 5 సంవత్సరాలు '
'అంటే అతను ఏ సంవత్సరం లో పుట్టాడో తెలుసన్నమాట నీకు?'
త్రిమూర్తులు ఉత్సాహంగా చెప్పాడు 'అవునండి. అతను ఆగస్ట్ 9, 1974 లో పుట్టాడండి.'
'బాలనటుడిగా అతను ఎన్ని సినిమాల్లో నటించాడు?'
మనసులో గణించుకుంటూ పోతున్నాడు త్రిమూర్తులు 'నీడ.....పోరాటం......శంఖారావం...... బజార్ రౌడీ......ముగ్గురు కొడుకులు........గూఢాచారి 117...........కొడుకు దిద్దిన కాపురం.......అన్న తమ్ముడు.....బాలచంద్రుడు..... మొత్తం తొమ్మిది సార్. అందులో వందాడినవి ఆరండి. 'నీడ, బాలచండ్రుడు, అన్నా తమ్ముడు పోయాయండి.' కొడుకు దిద్దిన కాపురం' సినిమాలో డబల్ ఏక్షనండి. బాలచండ్రుడు సినిమా తర్వాత బాలనటుడిగా నటించడం మానేసి కొన్నాళ్ళ తర్వాత 'రాజకుమారుడు ' తో హీరోగా వచ్చాడండి........'
చెప్పుకుంటూ పోతున్నాడు త్రిమూర్తులు. అప్రతిభుడయ్యాడు శంకరనారాయణ. మతిపోయింది అతనికి. ఒక చదువు రాని మొద్దులో యింతటి జ్ఞాపక శక్తా? అతనితో పాటు క్లాసులో అందరిదీ అదే పరిస్థితి. భయంకరమైన నిశబ్ధం నెలకొంది ఆ గదిలో. కేవలం త్రిమూర్తులు మాట ఒకటే వినిపిస్తోంది.
చెప్పడం పూర్తి చేసి మాస్టారి వంక చూసాడు త్రిమూర్తులు యింకా ఏమి అడుగుతాడో చూద్దామని. శంకరనారాయణ యింకా ఆపదల్చుకోలేదు. అతనికి చాలా ఉత్సాహంగా ఉంది ఒక ఆణిముత్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నందుకు.
'అతని కెరీర్ లో మొదటి పెద్ద హిట్టయిన సినిమా ఏది?
'హిట్టంటే......  హిట్టవ్వటమే కాకుండా అతనికి మంచి పేరు తీసుకొచ్చిన సినిమా 'మురారి ' అండి. అలా కాక అతని బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం 'ఒక్కడు ' అండి. ఆ రంకంగా మొదటి హిట్ సినిమా 'మురారి', బ్లాక్ బస్టరు 'ఒక్కడు.' ఆ సినిమా కన్నా ఎక్కువ కలెక్షన్ చేసిన సినిమా ఒకటుందండి......'
'ఏంటది?'
నవ్వుతూ చెప్పాడు 'పోకిరి '. ఆ సినిమా 63 సెంటర్లలో 175 రోజులూ, 200 సెంటర్లలో 100 రోజులు ఆడిందండి. అంటే "ఆల్ ఇండియా నేషనల్ రికార్డ్". నెట్టు గ్రాసొచ్చి 66.50 కోట్లు,  నెట్ షేఅర్ ఒఫ్ 48.285 కోట్లూ అంటే రజనీకాంత్ నటించిన 'చంద్రముఖీ సంపాదించిన గ్రాస్ 50 కోట్ల కంటే ఎక్కువన్నమాట. అంతే కాదండి పోకిరి ఆల్ యిండియా టాప్ గ్రాస్ షేర్ లో సెకండ్ ప్లేస్ వచ్చిందండి. ఫస్ట్ సినిమా 'గధర్ ' అండి. దాని కలెక్షను 70 కోట్లండి. ఆ సినిమా కన్న పోకిరి కి 3.5 కోట్లు తక్కువ వచ్చాయన్న మాట. కానీ నెట్ షేర్ లో మాత్రం గధర్ ని మించిపోయిందండి పోకిరి. 'గధర్' కి 45.1 కోట్లు వస్తే పోకిరి కి 48.285 కోట్లు వచ్చాయండి.'
చెప్పడం ఆపాడు త్రిమూర్తులు. 
శంకరనారాయణ కి నోటి మాట రావడం లేదు. ఏ పుస్తకం లో చదివాడు ? ఎక్కడ విన్నాడు ? ఎలా గుర్తు పెట్టుకున్నాడు ?  ఏ మాస్టారు నేర్పారు?  ఎంత జ్ఞాపక శక్తి యితనికి?
క్లాసులో అందరిదీ అదే పరిస్థితి. అందరూ నోరు వెల్లబెట్టుకొని అలా చూస్తూ ఉండిపోయారు.
శంకరనారాయణ తేరుకొని చప్పట్లు కొట్టారు. కొడుతూనే ఉన్నారు. త్రిమూర్తులు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
అంతే.
శంకరనారాయణ యింకేమీ మాట్లాడలేదు.
మాట్లాడవలసిన అవసరం రాలేదు. పిల్లలకి అర్ధమవ్వాల్సింది అర్ధమయ్యింది.
త్రిమూర్తులు వెళ్ళి కూర్చున్నాడు తన సీట్లో. కానీ మొదటి బెంచీలో.
రమేష్ లేచి వెనక సీట్లోకి మారిపోయాడు. అతనితో పాటు బాగా తెలివైన వారము అనుకున్న వాళ్ళు కూడా. శంకరనారాయణ వాళ్ళకి మాస్టారు అయినా 'త్రిమూర్తులు' మాత్రం మా'స్టారు.'  

No comments:

Post a Comment